ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బ..భారత్‌పై పాక్‌ కొత్త ఉగ్ర వ్యూహం

ఆపరేషన్‌ సిందూర్‌’ దెబ్బ..భారత్‌పై పాక్‌ కొత్త ఉగ్ర వ్యూహం

న్యూఢిల్లీ, సెస్టెంబర్ 5. అర్జున్ సమాచారం డెస్క్.

భారత్‌పై ఉగ్రవాద వ్యూహాన్ని పాకిస్థాన్‌ మార్చుకుంటున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. నేరుగా పాక్‌ సంబంధాలు బయటపడకుండా కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు పేర్కొన్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత ఉగ్రవాద వ్యూహాన్ని పాకిస్థాన్‌ పూర్తిగా మార్చినట్లు అధికారులు తెలిపారు.పాక్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి సంస్థల పాత ఉగ్ర మాన్యువల్స్‌ను వాడటం తగ్గించినట్లు సమాచారం. ఇవి భారత దర్యాప్తు సంస్థలకు బాగా పరిచయం కావడంతో దాడుల వెనుక పాక్‌ సంబంధాలను గుర్తించడం సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు.ఇప్పుడు అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ పేరుతో ఉన్న మార్గదర్శకాలను విదేశాల్లోని హ్యాండ్లర్లు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఇస్లామాబాద్‌, కరాచీ, రావల్పిండి నుంచి ఆదేశాలు వచ్చేవని చెప్పారు. ప్రస్తుతం సిరియా, ఇరాక్‌ వంటి ప్రాంతాల నుంచి హ్యాండ్లర్లు పనిచేస్తున్నట్లు తెలిపారు.భారత్‌లోని యువతను నేరుగా సంప్రదించకుండా సోషల్‌ మీడియా ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నారని అధికారులు వివరించారు. ముందుగా వ్యక్తుల ప్రొఫైల్స్‌ను గుర్తిస్తారు. ఆ తర్వాత పరిచయం పెంచుకొని నియామకం, మత ఛాందసవాదం వైపు మళ్లించడం, దాడులకు ప్రణాళిక రూపొందించడం జరుగుతున్నట్లు తెలిపారు.
‘లోన్‌ వుల్ఫ్‌’ దాడులపై దృష్టి
ఇలాంటి నెట్‌వర్క్‌ల ద్వారా ‘లోన్‌ వుల్ఫ్‌’ దాడులను ప్రోత్సహించాలని పాక్‌ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీటికి పెద్ద మొత్తంలో డబ్బు, భారీ మాడ్యూల్స్‌ అవసరం ఉండవు. ఆన్‌లైన్‌లో ప్రభావితమైన వ్యక్తులు సొంతంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీంతో దాడి వెనుక అసలు కుట్రదారులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు కష్టమవుతుంది.పాక్‌ ఇలా వ్యూహం మార్చుకోవడానికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మరోసారి అలాంటి ఆపరేషన్‌ను ఎదుర్కొనే పరిస్థితి పాకిస్థాన్‌కు లేదని పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ పాక్‌ ఉగ్ర మౌలిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పారు. అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి, ముఖ్యంగా ఎఫ్‌ఏటీఎఫ్‌ నిఘా కూడా పాక్‌ వ్యూహం మారడానికి మరో కారణమని తెలిపారు.భవిష్యత్తులో భారత్‌పై జరిగే ఏ ఉగ్రదాడినైనా కేవలం సరిహద్దు దాటి జరిగిన ఉగ్ర చర్యగా చూడబోమని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. దాన్ని తమపై జరిగిన యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రకటించింది. దీంతో పాకిస్థాన్‌ తన ప్రమేయం బయటపడకుండా ‘డినయబిలిటీ’కి (తిరస్కరణవాదం) ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు